మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

  •  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
  •  టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

 

నిజామాబాద్, బతుకమ్మ :  మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుతాలు సాధించగలరని అన్నారు. ఏ రంగంలో ఉన్న బాధ్యతలు మర్చిపోవద్దని, అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గుర్తు చేశారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెచ్చిందని, క్యాంటీన్ ల నిర్వహణ, యూనిఫాం లు కుట్టే బాధ్యతలను అప్పగించిందని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును  సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, మహిళా ఉద్యోగులు ఇంటి పనులు, ఉద్యోగ విధులను సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యాల పట్ల శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను, వివిధ రంగాలలో ప్రముఖంగా సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, జిల్లా పౌర సంబంధాల అధికారిణి నార్ల పద్మశ్రీ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, టీఎన్జీవో జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుమన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Women should move forward with confidence.
Comments (0)
Add Comment