పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. నూతనంగా కొనుగోలు చేసిన నీటి ట్యాంకర్లకు  బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, పట్టణంలో నీటి సరఫరాకు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కామారెడ్డి పట్టణంలో ఇప్పటికే 8 ట్యాంకర్ల ద్వారా ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉన్న వార్డుల్లో నీటిని సరఫరా చేయడం జరుగుతున్నదని, పట్టణ విస్తీర్ణం పెరగడం, నీటి ఎద్దడి తలెత్తడంతో కొత్తగా 50 లక్షల రూపాయలతో ఐదు నీటి ట్యాంకర్లు కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ వేసవి కాలంలో నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో నీటిని సరఫరా చేసి ప్రజల సమస్యలను తీర్చాలని అధికారులకు సూచించారు.

అలాగే 40 లక్షలతో కొనుగోలు చేసిన జె.సి.బి. కి కూడా పూజ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఎల్.ఆర్.ఎస్.ప్రక్రియ కొనసాగే నా తీరును కలెక్టర్ పరిశీలించారు.  అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని మున్సిపల్ బోర్ల నుండి నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న వాటిని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, హౌసింగ్ పిడి విజయ్ పాల్ రెడ్డి, మున్సిపల్ ఏఈ శంకర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Water shortages should be prevented in the city.
Comments (0)
Add Comment