అక్రమ భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచన
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్యను నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో లా &ఆర్డర్ అదుపు చేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాల పై ఉక్కు పాదం మోపి యువతను వాటి బారిన పడకుండా రక్షించాలని అన్నారు, మాదకద్రవ్యాలపై పోలీస్ శాఖ కళాశాల విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నగరంలో వరుస దొంగతనాలు చైన్ స్నాచింగ్, ఆటో, బైక్ దొంగతనాలు అరికట్టి ప్రజలకు రక్షణగా నిలవాలన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య, ఫుట్ పాత్ కబ్జాలు, అక్రమ భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోని సామాన్య ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. జిల్లా అభివృద్ధి, లా & ఆర్డర్ కాపాడటంలో పోలీస్ శాఖ తీసుకునే ప్రతి అంశంలో ఎమ్మెల్యేగా తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు.