ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-44 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై సుమలత తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇందల్వాయి నుంచి డిచ్పల్లి వైపు జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో ఇందల్వాయి టోల్ ప్లాజా అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం అతడు మృతి చెందినట్లు ఎస్సై సుమలత వెల్లడించారు. మృతుడి వివరాలు ఇప్పటివరకు గుర్తించలేదని, అతడి గురించి సమాచారం తెలిసిన వారు 87126 59854 నంబర్కు సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు.