బాన్సువాడ, బతుకమ్మ :
నస్రుల్లాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామంలోని ఆరు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ పనుల నిమిత్తం బయట గ్రామాలకు వెళ్లిన కుటుంబాల ఇళ్లలో అర్ధరాత్రి సమయంలో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆయా ఇళ్లల్లో నగదు, బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.