- అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్
మోర్తాడ్, బతుకమ్మ: రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించకుండా రైతులకు సరైన సబ్సిడీ ఎరువులు అందించకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిట్టనిలువుగా రైతాంగాన్ని దోపిడీ చేస్తుందని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రభాకర్ విమర్శించారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి జిల్లా సంయుక్త జిల్లాల ప్రథమ మహాసభ స్థానిక మోర్తాడ్ మండల కేంద్రంలో నిర్వహించారు. మహాసభ ప్రారంభానికి ముందుగా సంఘం జిల్లా అధ్యక్షుడు సారా సురేష్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం అమరవీరుల సంతాప తీర్మానం ఆమోదించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశంలో ఆకలి తీర్చే అన్నదాతల ఆకలికేకలు నేటి పాలకుల అసమర్థతకు నిదర్శనం అన్నారు. రైతు పండించిన పంటల కొనుగోలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయలేని స్థితిలో మొద్దు నిద్రలో నేటి పాలకులు ఉన్నారన్నారు. నాడు దిగుమతుల మీద ఆధారపడకుండా మన ఎగుమతులు మనం చేయాలని స్వాతంత్ర పోరాటంలో మనవి మనమే తయారు చేసుకునే పోరాట తత్వాన్ని మన రైతాంగం అవలంభించింది కానీ నేడు రైతును అవమాన పరిచే స్థితికి నేటి పాలకులు దిగజార్చారు. ఎరువుల మీద సబ్సిడీ లేదు, అట్టేసరూ ఎరువులతో అడ్డగోలు దోపిడి చేస్తున్నారు. నకిలీ విత్తనాలు, పంపిణీ చేసి రైతులను నిలువునా ముంచిన వారిపై కేసులు నమోదు చేసి, చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది. రైతు పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా లేకుండా, మద్దతు ధర రాక, ఆరుగాలం కష్టపడి పండించే రైతు ఆరిగోస పడాల్సిన స్థితికి నెట్టివేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం గతంతో స్విస్ బ్యాంక్ లో ఉన్నా నల్లదనం ప్రతి ఒక్కరికీ పంపిణీ చేశామని మోసం చేశారు. కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల రామకృష్ణ, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి దేవారం, జిల్లా అధ్యక్షులు ఎస్ . సురేష్, ప్రధానకార్యదర్శి గుమ్ముల.గంగాధర్, జిల్లా నాయకులు బి.కిషన్, సహాయ కార్యదర్శి బాబన్న, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు జి.కిషన్, అశోక్,లు జిల్లా నాయకులు జీ.పరమేశ్ ప్రసంగించారు. మహాసభల్లో ఏఐయూకెఎస్ జిల్లా, డివిజన్, మండల నాయకులు ఆర్. దామోదర్, ఏం. లింభాద్రి, ఏం. శేఖర్, జీ.నడిపినర్సయ్య, పీఓడబ్ల్యూ నాయకురాలు వి. సత్తెక్క, జమున, రాధ, డాక్టర్ శ్రీనివాస్, దయాళ్ సింగ్, నాగమణి, దశరథ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.