. . . పట్టించుకోని అధికారులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
సబ్ స్టేషన్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను ఆపరేటర్లే శుభ్రం చేసుకుంటున్నారు. వర్షాకాలం సమయంలో గడ్డి బాగా పెరిగి విష పురుగులకు, సర్పాలకు నిలయంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో విధులు నిర్వహించే ఆపరేటర్లకు ప్రాణ హాని జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆపరేటర్లు తమ విధులు నిర్వహించుకుంటూనే సబ్ స్టేషన్ ప్రాంగణంలోని పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. దీని పరిధిలో కొన్ని ప్రాంతాల్లో వాచ్ మెన్ లు ఉండగా, ఇంకొన్ని చోట్ల లేరు. విరమణ పొందిన వారి స్థానాల్లో మరొకరిని నియమింపకపోవడంతో ఆ ఖాళీలు భర్తీ గాకుండాపోయాయి.
. . . నిర్వహణ కోసం నిధులు
సబ్ స్టేషన్ ప్రాంతంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి, దీపాలు వెలిగించడానికి నిధులు ఇస్తున్నప్పటికీ ఖర్చు చేయట్లేడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళలో దీపాలు వెలగక అంధకారంలో కాలకృత్యాల కోసం బయటకు వెళ్ళినప్పుడు విష పురుగుల బారిన పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించడానికే వెన్ను జలదరిస్తోంది. బల్బ్ లు పాడైపోతే వాటి స్థానంలో కొత్త వాటిని ఆపరేటర్లే సమకూర్చుకుంటున్నారని తెలిసింది.
. . . వాచ్ మెన్లు లేక
కాపలగా ఉంటూనే, పరిసరాలను శుభ్రం చేయాల్సిన వాచ్ మెన్లు లేకపోవడంతో ఆపరేటర్లే ఆ పనులు చక్కదిద్దుకోవాల్సి వస్తోంది. విద్యుత్ రాక, పోకల గురించి ఎప్పటికప్పుడు రికార్డులలో రాస్తూ, మిగతా సమయాలలో పిచ్చి మొక్కల ఏరివేతల పనిలో నిమగ్నమవుతున్నారు. ఆపరేటర్లపై భారం పడకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.