. . . యువతకు పిలుపునిచ్చిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి
. . . ముగిసిన నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రీమియర్ లీగ్ పోటీలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, విద్యపై దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ఏప్రిల్ 20 నుండి 28 వరకు జరగగా, ఇందులో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, యోగా వంటి విభిన్న క్రీడలు నిర్వహించారు. మంగళవారం ప్రీమియర్ లీగ్ ముగింపు కార్యక్రమం ఉమెన్స్ కళాశాల మైదానంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. యువతకు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్, క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. నగరంలో పెరుగుతున్న చెడు అలవాట్లు, ముఖ్యంగా రాత్రి సమయంలో జరిగే బెట్టింగ్ కార్యకలాపాలపై యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మంచి భవిష్యత్తు కోసం లక్ష్యంతో ముందుకు సాగాలని, తప్పుదారులు పట్టకూడదని యువకులకు సూచించారు. యువత జీవిత నిర్మాణ దశలో ఉన్నందున చెడు అలవాట్లకు లోనైతే భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. క్రీడలు, విద్య, మంచి ఆలోచనలతో జీవితాన్ని సానుకూల దిశలో తీర్చిదిద్దుకోవాలని సూచించారు. నగరంలో రాత్రి 11:30 తర్వాత జరుగుతున్న బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో పోలీస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ యువత చదువులతోపాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. విద్యార్థులు తమ కాలేజీ సమయాన్ని వృథా చేసుకోకుండా క్రీడల ద్వారా శారీరక సామర్థ్యం, మానసిక తేజస్సు, ఉత్సాహం, సామాజిక చైతన్యం పెంపొందించుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడలు, టూరిజం రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, నిజామాబాద్ జిల్లాలో రన్నింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం క్రీడారంగానికి భారీగా నిధులు కేటాయించిందన్నారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. తాను కూడా క్రీడల వల్లనే ఐపీఎస్ ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించానని చెప్పారు. యువత మొబైల్ వ్యసనం, మత్తు పానీయాల నుండి దూరంగా ఉండేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు ఏప్రిల్ 20 నుండి 28 వరకు జరిగాయని, ఇందులో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, యోగా వంటి విభిన్న క్రీడలు నిర్వహించడం విశేషమన్నారు. ఉమెన్స్ కళాశాల మైదానంలో ఈ పోటీలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
“సే నో టు డ్రగ్స్ – సే యెస్ టు స్పోర్ట్స్” అనే నినాదంతో యువత ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ శుభం ప్రకాష్ , రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నగర మేయర్ కూరగాయల ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, నిజామాబాద్ , ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సి టి సి ఎ సి పి లు సిఐలు, ఎస్సైలు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హందన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, అడ్వకేట్ రాజేందర్రెడ్డి, ఎన్ ఎస్ సి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కవిత రెడ్డి, కోశాధికారి సంతోష్ కుమార్, సంయుక్త కార్యదర్శులు రజనీకాంత్, శిరీష్, శ్రీనివాస్ రె డ్డి, డాక్టర్ ఉష, డివైఎస్ వో పవన్ కుమార్, మల్లేష్ గౌడ్, మీసాల ప్రశాంత్, అజ్మత్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.