- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఒక్కొక్కరు ముందుకు వచ్చి రక్తం దానం చేస్తే, ఎన్నో ప్రాణాలు కాపాడగలమని, ఇది ఒక మనిషి జీవితం కోసం మనం చేయగల గొప్ప సేవ అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 66 వ సంవత్సరం ఆవిర్భావం సందర్భంగా నిర్వహించిన ” స్వచ్ఛంద రక్తదాన శిబిర ” కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్ లో సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం కార్యక్రమం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సారథ్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఆయన హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన రక్తం ఎవరికో ఒకరి ప్రాణాన్ని నిలబెట్టగలదని, అది మనకు తెలుసు అందుకే ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడల్లా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ తరఫున, సామాజిక బాధ్యతగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎం.పూర్ణచంద్రరావు, పోలీస్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు మోహన్ కిషోర్, అరుణ్ కుమార్, అబ్దుల్ ఫర్హాజ్స్ వి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.