నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఈనెల 18న చేపట్టిన రాష్ట్ర బంద్ కు మద్దతు తెలియజేస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చర్చ జరిగి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. కానీ ఈ బిల్లు గవర్నర్ పెండింగ్ లో ఉంచారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత హైకోర్టు స్టే విధించడం బాధాకరమన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని ఆరోపించారు. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. పాలక పార్టీలు ద్వంద వైఖరిని విడనాడాలని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు న్యాయమైన డిమాండ్ అని, కుట్రలు చేసి రిజర్వేషన్ల పెంపును అడ్డుకోవడం సరికాదన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాల జేఏసీ ఈనెల 18న ఇచ్చిన రాష్ట్ర బందు పిలుపుకు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ మద్దతిస్తుందని, బంద్ లో పాల్గొంటామని తెలియజేశారు. బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర నాయకులు వి.గోదావరి, కే.సంధ్యారాణి, బి.లింగం, టి.విటల్, డి.గంగాధర్ మహేందర్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.