నిజామాబాద్, బతుకమ్మ : మోపాల్ మండలం కంజర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలో చేపట్టిన పనుల గురించి ప్రధానోపాధ్యాయుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ. 11.20 లక్షల నిధులు మంజూరు కాగా, తాగునీటి వసతి, విద్యుత్, ఫ్లోరింగ్ తదితర ప్రతిపాదిత పనులన్నీ పూర్తి అయ్యాయని హెచ్.ఎం గోపాలచారి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇంకా ఏమైనా వసతులు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఈఓ అశోక్, ఎంపీడీఓ రాములు తదితరులు ఉన్నారు.