నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని గిరి రాజ్ కళాశాల ఎదుట రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో హెచ్సీయూ భూములను కాజేయ్యాలి అని చూస్తోందని అన్నారు. ఈ తప్పుడు ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు. లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా పిలవబడే హెచ్సీయూ భూములలో ఉన్న వృక్ష,పశు సంపదను నాశనం చేస్తూ తీసుకువిచ్చే అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు అని తెలిపారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి ఇప్పటివరకు విద్యార్థి వ్యతిరేక విధానాలనే అవలంబిస్తుందని అన్నారు. అటు ఫీజు రియాంబర్స్మెంట్ విడుదల చెయ్యకుండా డిగ్రీ కాలేజీలు మూతబడేల చేస్తూ, ఈ యూనివర్సిటీల భూములను లాక్కోవడం విద్యావ్యవస్థకు గొడ్డలి పెట్టని అన్నారు. అదే 400 ఎకరాల భూములలో విద్యా వ్యవస్థ కోసం మరిన్ని భవనాలను ఏర్పాటు చేసి కొత్త కోర్సులను అందించే ప్రయత్నం చెయ్యాల్సిన ప్రభుత్వం భూములను కాజేసి ప్రైవేట్ వ్యక్తులకు కమిషన్ మీద అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తుందని అన్నారు. దీన్ని అడ్డుకోవడానికి ఎంతవరకైనా వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా హెచ్సీయూ భూములకోసం ఉద్యమం చేపట్టదలచిన తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులను,కార్యకర్తలను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల పై అక్రమ కేసులు బనాయించి భూములను కాజేసి ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి విద్యార్థి లోకం దమ్మెంటే రుచి చూపిస్తాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సుజిత్ , ధర్మేందర్, మహేష్ ,యశ్వంత్ గౌడ్ ,సిద్ధు ,ఆరియన్,తదితరులు పాల్గొన్నారు.