. . . భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ
జగిత్యాల, బతుకమ్మ :
కుటుంబ కలహాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను గొల్లపల్లి స్టేషన్ కు చెందిన బ్లూ కోల్ట్స్ హెడ్ కానిస్టేబుల్ ఆనంద్, కానిస్టేబుల్ రవి లు కాపాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి ఒక మహిళ తన భర్తతో గొడవపడి చనిపోతానంటూ ఏడుస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. శ్రీరాముల పల్లె గ్రామానికి చెందిన స్థానికులు ఆమెను గ్రామ శివారులోని కాలువ వైపు వెళ్లడం గమనించి వెంటనే డయల్ – 100 కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే బ్లూ కోల్ట్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మహిళకు తగిన కౌన్సిలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అప్రమత్తత, సమయస్ఫూర్తి, మానవత్వంతో స్పందించడం ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యత అని అన్నారు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది వేగంగా స్పందించి ఒక విలువైన ప్రాణాన్ని కాపాడడం అభినందనీయమని కొనియాడారు. అలాగే, ఆత్మహత్య ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం కాదని , జీవితంలో ఎలాంటి కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యక్తిగత ఒత్తిడులు ఎదురైనా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయం కుటుంబ సభ్యులకు జీవితాంతం తీరని వేదన మిగులుస్తుందని అన్నారు. మహిళ ప్రాణాలను కాపాడిన బ్లూ కోర్ట్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.