నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లేకుంటే ఈనాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఉండేది కాదని, కరెన్సీ పై అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెర్రిపోతుల పరశురామ్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 1921లో ఇంపీరియల్ బ్యాంక్ కుప్పకూలగా, 1923లో బీఆర్ అంబేద్కర్ సగటు వ్యక్తి కోణంలో ఆలోచించి ‘రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం’ అనే పుస్తకాన్ని రాసి హిల్టాన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్ కు ఇవ్వడంతో ఇది వాస్తవమని గ్రహించారని, 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు జరిగిందంటే అది కేవలం అంబేద్కర్ కృషే కారణమని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డిసెంబర్ 3, 4 తేదీల్లో మహాధర్నా చేపట్టనున్నామని తెలిపారు. కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సలహాదారులు ముంబై నేత మూలనివాసి మాలజీ, చక్రాల నాగమణి పద్మశాలి, పి.స్వప్న, కాపు శంకరవ్వ, ఏవైఎస్ జిల్లా అధ్యక్షులు డీఎల్ మాలజీ, మహానాడు జిల్లా అధ్యక్షుడు సక్కి విజయకుమార్, ఏవైఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సౌడ జయరాజు, జిన్నా జనార్దన్, మున్నూరు కాపు సంఘం నేత కళ్లెం భోజన్న, జిన్నా జనార్దన్, భీం ఆర్మీ నేత ఎస్ గంగాప్రసాద్ రజక, జాంభవ చమార్, సతీశ్ మహరాజ్, జర్నలిస్ట్ మామిడి రాజు పాల్గొన్నారు.
