. . . బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై వినతి
. . . ప్రగతి భవన్ ఎస్ బిఐ ఎదుట ఉద్యోగుల నిరసన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కోనసాగుతున్నాయి. సోమవారం ప్రగతి భవన్ ఎస్ బి ఐ ఎదుట మధ్యహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ను బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సోమవారం కలిశారు. జిల్లా కేంద్రంలో ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఎంపీ ని కలిసి, తమ సమస్యలు, డిమాండ్లపై మెమోరాండం అందజేశారు. బ్యాంకు ఉద్యోగులు ఉద్యోగ భద్రత, పెన్షన్ హక్కులు, బ్యాంకుల ప్రైవేటీకరణ, సిబ్బంది కొరత, పెరుగుతున్న పనిభారం వంటి అంశాలపై ఎంపీతో సుదీర్ఘంగా చర్చించారు. నూతన పెన్షన్ విధానం (ఎన్పీఎస్) ఉద్యోగుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతోందని పేర్కొంటూ పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలి అని కోరారు. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాలు ఉపసంహరించుకుని ప్రజా రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు, ఆరోగ్య భద్రత పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, గురునాథ్, శ్రీనివాస్, సునంద, ప్రమోద్, సుధాకర్, సుప్రీం, సతీష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

