నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అడ్వకేట్స్ పరపతి సహకార సొసైటీ లిమిటెడ్ ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగు డైరెక్టర్ పదవులకు శుక్రవారం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, పులి జైపాల్ తెలిపారు. నాలుగు డైరెక్టర్ పదవులకు ఐదుగురు పోటీ చేస్తున్నారని తెలియజేశారు. మొత్తం నాలుగు ఓట్లు వేయాలని సూచనలు చేశారు. సొసైటీ బై లా ప్రకారం ప్రతి సంవత్సరం నలుగురు డైరెక్టర్లు పదవి విరమణ చేస్తారని వారి స్థానంలో నూతన డైరెక్టర్ల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరించి ఎన్నికలు జరుపడం జరుగుతోందని వారు తెలిపారు. సోసైటీలో మొత్తం 395 మంది సభ్యులుగా ఉన్నారని వివరించారు. అందరు ఓటు హక్కులు కలిగి ఉన్నారని అన్నారు. 24 తేది శుక్రవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ రూమ్ 119 లో పోలింగ్ జరుగుతుందని అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. సొసైటీలో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉంటారని వారందరు సమావేశమై వచ్చే ఆర్థిక సంవత్సరానికి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నిక పూర్తి కార్యవర్గం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా లోని న్యాయవాద సొసైటీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుని సహకరించాలని వారు కోరారు.
