- 14 ఆర్సీలు, మూడు డ్రైవింగ్ లైసెన్స్ లతో పట్టుబడిన ఏజెంట్
- సంబంధిత సెక్షన్ అధికారులపై రవాణా శాఖ చర్యలు తీసుకుంటుందా..?
- ఏసీబీ ఆకస్మీక తనిఖీలతో ఒరిగేదేమిటి..?
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. రవాణా శాఖాధికారులు దళారులతో కుమ్మకై సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల కాలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లు, లారీలపై జరిమానా విధించడంలో ఏజెంట్ల ద్వారా వసూళ్ళ కార్యక్రమం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో రవాణా శాఖ అధికారులు రహదారులపై తనిఖీల పేరుతో ముక్కుపిండి వసూల్ చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఈ కారణంతో బుధవారం నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రవాణా శాఖ కార్యాలయంలోకి ఏసీబీ అధికారులు రాగానే దళారులు తోకముడిచారు. అధికారులు వస్తూనే రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్

కార్యాలయంలో చెనల్ గేట్ మూసివేసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖలీల్ అనే ఏజెంట్ వద్ద 14 ఒరిజినల్ టూవీలర్ బైక్ ఆర్ సీలు, మూడు డ్రైవింగ్ లైసెన్స్ లు దొరికాయి. అతని వద్ద రూ.27 వేల నగదు లభించింది. అయితే అధికారులెవ్వరు లంచాలు తీసుకుంటూ పట్టుబడకపోవడం విశేషం. అతని వద్ద దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ లు, ఆర్ సీల గురించి ఆరా తీశారు. ప్రత్యేక కోడ్ ద్వారా డబ్బుల వసూళ్ళ కార్యక్రమం జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ విషయంలో ఏయే అధికారికి ఎంత ముడుపులు అందుతున్నాయి, ఏజెంట్ల నియామకం గురించి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఏసీబీ అధికారులు ప్రకటించారు.

నిజామాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్ వద్ద దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ లు, రిజిస్ట్రేషన్ బుక్ ల వ్యవహారంపై సంబంధిత రవాణా శాఖ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటారా అన్న సంశయాలు వ్యక్తమౌతున్నాయి. నిజామాబాద్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ప్రారంభించిన కొత్తలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలో 87 వేల నగదు దొరికింది. అయితే కొందరు అధికారులు ఏసీబీ అధికారులు తనిఖీలకు లోపలకు ప్రవేశించగా డబ్బులు కిటికీల ద్వారా బయటకు విసిరేశారు. కానీ ఆ కేసులో ఏసీబీ నివేదిక ఆధారంగా ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం బుధవారం ఏసీబీ ఆకస్మిక తనిఖీలో ఖలీల్ అనే ఏజంట్ పట్టుబడిన విషయం తెల్సిందే. అతని వద్ద నగదుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లు, ఆర్ సీలు దొరకగా సంబంధిత సెక్షన్ సిబ్బందిపైనా అయినా ఏసీబీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారో లేక బుట్టదాఖలవుతాయోననే చర్చ జరుగుతుంది. అత్యంత అవినీతి జరుగుతున్న శాఖలలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, విద్య, వైద్య శాఖల తర్వాత రవాణా శాఖనే బంగారు గుడ్లు పెట్టే శాఖగా పరిగణిస్తారు. అలాంటి శాఖలో పోస్టింగ్ ల కోసం లక్షలు కుమ్మరించి వచ్చేఉద్యోగులు, అధికారులు అదే స్థాయిలో లంచాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వారు చేతికి మట్టి అంటకుండా ఏజెంట్ల ద్వారా ఈ తతంగాన్ని జరుపుతున్న విషయం బట్టబయలు అవుతున్నా వారిపై చర్యలు తీసుకోకపోవడంతో అవినీతి నిత్య తంతుగా జరుగుతుంది.

