నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో ఓ యువకుడు నీటమునిగి చనిపోయాడు. ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగర శివారులోని శాస్త్రినగర్ కు చెందిన సంపగి వెంకట్ (23) తన స్నేహితుడితో కలిసి శుక్రవారం స్థానికంగా ఉన్న జానకంపేట్ రైల్వేస్టేషన్ ప్రక్కన గల కుంటలో చేపల వేటకు వెళ్లారు. రాత్రి వేళ చేపల వేటకు దిగిన వెంకటి అక్కడే ఈత రాక నీటిలో మునిగిపోయాడు. అతనితో వచ్చిన యువకుడు భయపడి ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. శనివారం ఉదయం వెంకటి కుటుంబ సభ్యులు అతని కోసం ఆరా తీయగా అతడి మృతదేహం జానక్కంపేట్ కుంటలో బహిర్గతమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు 6వ టౌన్ పోలీసులు తెలిపారు.
