నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : శ్రీరామనవమి నాడు కన్నుల పండుగగా జరిగే భద్రాచల రామయ్య కల్యాణానికి తెలంగాణ రాష్ట్రం నుండి 250కిలోల గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్ప దీక్షతో గ్రామ, గ్రామాన శ్రీకారం చుట్టింది గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ. అందులో భాగంగా మంగళవారం నిజామాబాద్ లోని కోటగల్లిలో గల జైర్ కోట్ హనుమాన్ మందిరంలో వందకు పైగా భక్తులు పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు అందజేశారు. వారిచే రామనామ స్మరణ చేయించి రామనామం గురించి, భద్రాచల గోటి తలంబ్రాల యొక్క పవిత్రత గురించి అందరికీ వివరించారు. మైసమ్మ భజన మండలి, జైర్ కోట్ భజన మండలి, మల్లికార్జున భజన మండలి, విజయగణపతి భజన మండలి పాల్గొని భజనను ఆలపించారు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవకు భక్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ తాము భద్రాచలం వెళ్లలేక పోయిన కూడా తమ చేతులతో ఓలిచిన ఈ గోటి తలంబ్రాలు వెళ్లడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

