నిజామాబాాద్, బతుకమ్మ : గత 15 రోజులుగా నగరంలోని జెండా బాలజీ ఆలయంలో కొనసాగిన జాతర ఆదివారంతో ముగిసింది. వంశపారపర్యం అర్చకులు అజయ్ సంగ్వాయి, సంజయ్ సంగ్వాయి, విజయ్ సాంగ్వాయ్ నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే పౌర్ణమి రోజు సాయంత్రం జెండాతో పాటు ఉత్సవమూర్తులను శోభాయాత్ర గా పూలాంగ్ సమీపంలోకి తరలించడం ఆనవాయితీ. కాగా ఈసారి చంద్రగ్రహణం ఉండడంతో ఉదయాన్నే జెండాను ఊరేగించారు. ఆలయం నుంచి సిర్నాపల్లి గడి గోల్ హనుమాన్ మీదుగా పూలాంగ్ బ్రిడ్జి సమీపంలో ప్రతిష్ఠించారు. ఆదివారం పౌర్ణమి కావడంతో దర్శనానికి అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, ఆలయ చైర్మన్ ప్రమోద్, ఈవో వేణు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జెండా జాతర లో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండాను దర్శించుకున్నారు. సంప్రదాయంగా వస్తున్న జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ పండితులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం ఇచ్చారు.


