. ఆందోళన విరమించిన ఏఈవోలు
. డీసీఎస్ యాప్ వేసుకుంటే సరే
. లేదంటే కక్ష సాధింపు చర్యలే..
హైదరాబాద్, బతుకమ్మ: డిజిటల్ క్రాఫ్ సర్వేకు ససేమిరా అంటున్న ఏఈవోలను దారిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం సస్పెన్షన్ వేటును ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రధాన కార్యాలయం ఎదుట ఏఈవోలు నిరసనకు దిగారు. ఏఈవోలు డీసీఎస్ (డిజిటల్ క్రాఫ్ట్ సర్వే) యాప్ వేసుకోవాల్సిందేనని, అలాగైతేనే సస్పెన్షన్ తొలగిస్తామని ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. చేసేదిలేక అధికారులు చెప్పినట్లు నడుచుకునేందుకు ఏఈవోలు ఒప్పుకోవడంతో సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం అభయమిచ్చింది.
ఆందోళన విరమణ
క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే ఏఈవో(వ్యవసాయ విస్తీర్ణాధికారి)లు రైతు బీమా పత్రాలు సమర్పించడంలో అలసత్వం వహించారనే నెపంతో రాష్ట్రంలో 162 మందిపై ఏకకాలంలో సస్పెన్షన్ పేరుతో మంగళవారం వేటు వేశారు. ఊహించని పరిణామం ఎదురవడంతో అదే రోజు సాయంత్రానికి వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయానికి అందుబాటులో ఉన్న సుమారు 60 మంది చేరుకున్నారు. మరుసటి రోజు ఏఈవోలు మాస్ లీవ్ పెట్టి పట్నం బాట పట్టారు. రాష్ట్ర టీఎన్జీవో నాయకుడితోపాటు విస్తీర్ణాధికారుల అడ్ హక్ కమిటీ నాయకులు కలిసి డైరెక్టర్ తో మంతనాలు జరపడంతో ప్రస్తుతానికి సస్పెన్షన్ ఎత్తివేస్తున్నామని హామీ ఇచ్చారు.
డీసీఎస్ లేకుంటే చర్యలే..
ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం డీసీఎస్ యాప్ వేసుకొని క్షేత్ర స్థాయిలో వారి సూచనలను పాటిస్తూ విధులు నిర్వహించాల్సిందే. లేదంటే కక్ష సాధింపు చర్యలు మొదలు కానున్నాయనే విషయం ఏఈలకు అర్థమైపోయింది. నెలల తరబడిగా డీసీఎస్ పై అనాసక్తి ప్రదర్శించడంతో రైతు బీమా కారణాన్ని చూపుతూ సస్పెన్షన్ వేటును ప్రదర్శించారు. ఏ కొంచెం అలసత్వం కనబరచినా పీఎం కిసాన్, అక్టివిటీ లాగర్లలో తప్పులు వెదికి కుట్రపూరిత చర్యలకు దిగుతామనే సంకేతాన్ని పరోక్షంగా ఏఈవోల చెవిన పడేలా చేశారు. డీసీఎస్ యాప్ వేసుకొని దాని నుంచి జరిగిన పనులను పరిగణలోకి తీసుకొని ఈ నెల 28న కమిషనర్ సమక్షంలో సమావేశం జరగనుంది.
