. . . పిల్లలు ను కాపాడిన స్థానికులు
వెబ్ డెస్క్, బతుకమ్మ :
రాజస్థాన్లోని జైసల్మేర్లో తీవ్ర విషాదం తప్పింది. 25 మంది పాఠశాల విద్యార్థులతో ఉదయం ప్రయాణిస్తున్న ఓ స్కూల్ బస్సు నడుస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్న చిన్నారులు భయంతో కేకలు వేయడంతో సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న కూలీలు వెంటనే స్పందించారు. పిల్లల అరుపులు విన్న స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంటల్లో చిక్కుకున్న బస్సు వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బస్సులోకి చేరుకుని ఒక్కొక్కరుగా విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. స్థానికుల సాహసోపేత చర్యలతో 25 మంది విద్యార్థులను సురక్షితంగా రక్షించారు. అయితే కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో విద్యార్థుల్లో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఈ స్కూల్ బస్సు జైసల్మేర్ పబ్లిక్ స్కూల్ కు చెందినదిగా సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
