. . . వ్యవసాయ విస్తరణ అధికారి డి.పండరి
జుక్కల్, బతుకమ్మ :
రైతులు ఇకపై యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను కూడా ఆన్లైన్ యాప్ ద్వారా ముందుగా బుకింగ్ చేసుకుని కొనుగోలు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారి డి. పండరి సూచించారు. జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో సోమవారం రైతులకు ఆన్లైన్ యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పండరి మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల బుకింగ్ కోసం ప్రత్యేక యాప్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. కామారెడ్డి జిల్లాలో ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎరువుల విక్రయాలు, నిల్వలు, రైతుల డిమాండ్, సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక డిజిటల్ వ్యవస్థను రూపొందించినట్లు ఆయన వివరించారు. రైతులు తమకు అవసరమైన ఎరువులను ఏ డీలర్ వద్ద కొనుగోలు చేయాలనుకుంటున్నారో యాప్లోనే ఎంపిక చేసుకుని బుకింగ్ పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. బుకింగ్ చేసుకున్న తర్వాత దాని కాలపరిమితి రెండు రోజులు ఉంటుందని, ఈ వ్యవధిలో ఎంపిక చేసుకున్న డీలర్ వద్దకు వెళ్లి ఎరువులను కొనుగోలు చేయాలని పండరి సూచించారు. రైతులు ఈ కొత్త విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎరువుల కొనుగోలుకు ముందుగానే ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కోరారు.
