. . . బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ భత్యాన్ని చెల్లించలేదని, ఎన్నికల భత్యాన్ని వెంటనే చెల్లించాలని బీఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని జోన్ల వాటర్ సెక్షన్ కార్మికులు శుక్రవారం విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ (బీఎల్టీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో కార్మికులు తమ న్యాయమైన హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించిన కార్మికులకు చెల్లించాల్సిన భత్యాలను నిలిపివేయడం అన్యాయమని అన్నారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపుగా ఎన్నికల విధుల భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను డిమాండ్ చేశారు. ఎన్నికల విధుల భత్యాన్ని తక్షణమే చెల్లించకపోతే బీఎల్టీయూ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ జోన్ల వాటర్ సెక్షన్ కార్మికులు పాల్గొని, ఎన్నికల విధుల భత్యాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.

