. . . కంటోన్మెంట్లో 270 ఆలయాలకు ఆర్థిక సహాయం
హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవాలను భక్తులు వైభవంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆలయాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 270 దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయంగా చెక్కులను మంజూరు చేసింది. ఆలయాలకు మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఆలయ కమిటీలు ఈ ఆర్థిక సహాయంతో బోనాల వేడుకలను మరింత ఘనంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలు, పండుగల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఆలయాలకు అందించిన ఈ ఆర్థిక సహాయం బోనాల ఉత్సవాల నిర్వహణకు మరింత ప్రోత్సాహాన్ని అందించనుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

