. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఊర పండగ కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదని, అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే సామాజిక ఐక్యతకు ప్రతీక అని నగర మేయర్ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. నగరంలోని సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఊర పండగ వేడుకలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహక కమిటీ సభ్యులు, ప్రజలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఇలాంటి ఉత్సవాలు ప్రజల మధ్య ప్రేమ, సోదరభావం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. నగర అభివృద్ధితో పాటు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు నగర పాలక సంస్థ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని మేయర్ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే ఇలాంటి వేడుకలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు యువతకు మన సంస్కృతి గొప్పతనాన్ని పరిచయం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మఠం రేవతి, సిటీ జనరల్ సెక్రటరీ స్వప్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్వ సమాజ్ కమిటీ సభ్యులు, వివిధ సామాజిక సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంప్రదాయ కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం నిర్వాహకులు నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ కమిటీ సభ్యుల సేవలను అభినందిస్తూ, ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు. భక్తి, సంప్రదాయం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఊర పండగ వేడుకలు నిజామాబాద్ నగరంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పాయి.

