నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కోర్టు డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ (డీడీఓపీ)గా ఎం. రజనీ ఇటీవల నియమితులై బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు భవనంలోని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ, న్యాయవాదుల పరస్పర సహకారంతో కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. న్యాయవాదులు, ప్రాసిక్యూషన్ విభాగం మధ్య సమన్వయం పెంపొందించడం ద్వారా న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన న్యాయం అందేలా అందరూ సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ సభ్యులు బిట్ల రవి, పడిగేల వెంకటేశ్వర్, ఆశ నారాయణ, మానిక్ రాజ్, పిల్లి శ్రీకాంత్, జయప్రకాశ్ లోహియా, చుక్కబొట్ల రాజు, రావణ్ రాథోడ్ సాయి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
