. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎస్ఐఆర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పై మంగళవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎలక్ట్రోరల్ ఓటరు జాబితాలో తప్పిదాలకు చోటు లేకుండా పారదర్శకంగా రూపొందించి, అర్హులైన ఓటర్లు అందరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఇప్పటికే ఇంటింటి సర్వే నిర్వహించి ఎన్యూమరేషన్ పత్రాలను ప్రతి ఓటరుకు అందజేసినందున, వాటిని పూరించి సకాలంలో ప్రతి ఓటరు బీ ఎల్ ఓ లకు తిరిగి ఇచ్చేలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను అధికారుల సమన్వయంతో వేగవంతం చేస్తున్నామని, జిల్లాలో ఇప్పటివరకు 82 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేశామని, వచ్చే వారం నాటికి 90 శాతం పూర్తి చేస్తామని అన్నారు. నిర్ణీత గడువులోగా 100 శాతం ఈ ప్రక్రియ పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీఎల్ఓలు, బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువతను సమన్వయం చేసి డిజిటలైజేషన్ వేగవంతానికి కృషి చేస్తున్నామని సీఈఓ దృష్టికి తెచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

