నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్ లో గల వినాయక్ నగర్ లో విద్యుత్ లైన్ ల మరమ్మత్తు చేస్తున్న ప్రైవేటు వర్కర్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వినాయక్ నగర్ లోని విశాల్ మార్ట్ ఎదురుగా ప్రైవేటు కాంట్రాక్టరు ద్వారా విద్యుత్ లైన్ లలో ఉన్న లోపాలను సరి చేస్తున్నారు. ముందుగా స్థానికంగా సబ్ స్టేషన్ నుంచి ఎల్ సి తీసుకుని నగరంలొని ఇంద్రాపూర్ కు చెందిన ప్రశాంత్ అనే ప్రైవేట్ వర్కర్ ను స్తంభం పైకి ఎక్కించారు. అతడు పోల్ పై ఎక్కి పనులు చేస్తుండగా ఇన్వర్టర్ (జనరేటర్) ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్ షాక్ కు గురయ్యాడు. అక్కడే విద్యుద్ ఘాతానికి గురి కావడంతో కింద ఉన్న తోటి వర్కర్ లు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను గుర్తించి నిలిపి వేశారు. విద్యుత్ స్తంభం పై ఉన్న ప్రశాంత్ ను కిందకి దించారు. అతను కరెంట్ షాక్ తో స్పహ కోల్పోవడంతో అతడిని శ్రీ నగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఏడీఈ వినోద్ ని వివరణ కోరగా ప్రవేటు కాంట్రాక్టర్ ద్వారా విద్యుత్ లైన్ ల మరమ్మత్తులు చేస్తున్న విషయం వాస్తవమేనని తెలిపారు. సంఘటన గురించి తనకు ఆలస్యంగా తెలిసిందని వివరాలు కనుక్కుని చెప్తానని అన్నారు.
