. . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
నాగిరెడ్డిపేట, బతుకమ్మ :
సహకార సంఘాలు రైతులకు సేవలందించడమే కాకుండా ఆర్థికంగా కూడా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ద్వారా పీఏసీఎస్ కు శాశ్వత ఆదాయ వనరు ఏర్పడుతుందని, ఆ ఆదాయాన్ని రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, వ్యవసాయ అనుబంధ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

