కామారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు.మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఇటివల కార్డన్ సెర్చ్ లో పట్టుబడ్డ పత్రాలు లేని వాహనాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఇతర విభాగాలు తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి బాధితుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి శాఖపై నమ్మకాన్ని పెంపొందించాలని అధికారులను ఆదేశించారు.

నాణ్యమైన దర్యాప్తు తో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలి అన్నారు. సైబర్ , ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులు ఓటీపీ మోసాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలి అని సూచించారు. డయల్-100 కు అత్యవసర సమయాల్లో వచ్చే కాల్స్కు తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలి. ట్రాఫిక్ నియంత్రణకు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టాలి అని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో అమలు చేస్తున్న ఆపరేషన్ కవచ్ లో భాగంగా గస్తీ పెంచి అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తూ, రాత్రి వేళల్లో వాహన తనిఖీలు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, ఆస్తుల భద్రత సిబ్బంది పనితీరుపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ తనిఖీలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, టౌన్ సిఐ నరహరి, ట్రాఫిక్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

