. . . తహసీల్దార్ బాలయ్య
ఇందల్వాయి, బతుకమ్మ:
ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా లోటుపాట్లు జరగకుండా అధికారులు, బీఎల్ఓలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఇందల్వాయి తహసీల్దార్ బాలయ్య సూచించారు. సోమవారం ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి, గన్నారం, మెగ్యనాయక్ తాండా, కేకే తాండా, తీర్మన్పల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను తహసీల్దార్ బాలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియపై బీఎల్ఓలకు అవగాహన కల్పించి, ఫారాలను పంపిణీ చేసే ముందు తప్పనిసరిగా స్కాన్ చేసి అనంతరం ఓటర్లకు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా, ఫారాలను ఎలా నింపాలి, పూర్తి చేయడానికి అవసరమైన వివరాలు ఏమిటో ఓటర్లకు స్పష్టంగా వివరించి చెప్పాలని సూచించారు. ఫారాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రతి ఇంటికి సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని బీఎల్ఓలకు సూచించారు. ఎన్యూమరేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఇందల్వాయి సర్పంచ్ లోకాని గంగమణి గంగారాం, గన్నారం సర్పంచ్ సుజాత శ్రీనివాస్, తీర్మన్పల్లి సర్పంచ్ చింతల కిషన్, మెగ్యనాయక్ తాండా సర్పంచ్, కేకే తాండా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, బీఎల్ఓలు, జీపీఓలు తదితరులు పాల్గొన్నారు.

