. . . రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాలి
ఇందల్వాయి, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యూరియా బుకింగ్ కోసం ఉపయోగిస్తున్న తెలంగాణ స్టేట్ యాప్లో పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయని మండల వ్యవసాయ విస్తరణ అధికారి (ఏవో) శ్రీకాంత్ తెలిపారు. ఈ మార్పులు నేటి నుంచే అమలులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. రైతులు సాగు విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని దశల వారీగా యూరియా పొందే విధంగా కొత్త నిబంధనలు రూపొందించినట్లు తెలిపారు. రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులు ఒకే విడతలో అవసరమైన యూరియా బస్తాలను పొందే అవకాశం ఉంటుంది. ఐదు ఎకరాల వరకు సాగు చేసే రైతులకు రెండు విడతల్లో యూరియా అందజేయనుండగా, ఐదు ఎకరాల కంటే ఎక్కువ సాగు విస్తీర్ణం ఉన్న రైతులకు మూడు విడతల్లో యూరియా పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఈ పంపిణీ 40:30:30 నిష్పత్తి ప్రకారం జరుగుతుందని తెలిపారు. అలాగే ఒకసారి యూరియా బుకింగ్ చేసిన రైతులు తదుపరి బుకింగ్ చేసేందుకు కనీసం 20 రోజుల విరామం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ మార్పులను రైతులందరూ గమనించి, కొత్త నిబంధనలకు అనుగుణంగా యూరియా బుకింగ్ చేసుకోవాలని ఏవో శ్రీకాంత్ సూచించారు.
