. . . భక్తులకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించడమే లక్ష్యం
సదాశివనగర్, బతుకమ్మ :
సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఉన్న శివాలయ ఆవరణలో ఆదివారం దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి ఆలయ పరిసరాలను పూర్తిగా శుభ్రం చేశారు. వర్షాకాలంలో పాములు, విషపురుగులు, దోమల సంచారం పెరిగే అవకాశం ఉన్నందున భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయానికి విచ్చేసే భక్తులు పరిశుభ్రమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా అన్ని విధాలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆలయ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆలయ పవిత్రతను కాపాడేందుకు గ్రామస్థులు, భక్తులు నిరంతరం సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిశుభ్రత కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించి ఆలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని పరిశుభ్రత పనుల్లో చురుకుగా పాల్గొన్నారు.
