- ఢిల్లీ వాలా స్వీట్ హోం తయారీ కేంద్రంలో నిర్వాహణ పట్ల నోటీసులు జారీ
- ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో బట్టబయలైన డొల్లతనం
- ఐదుగురు సభ్యుల టీంతో స్టార్ హోటళ్ళలో తనిఖీలు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో స్టార్ హోటళ్ళకు, పేరు మోసిన స్వీట్ షాప్ లకు వెళ్లేముందు ప్రజలు జాగ్రత్త వహించాలి. ఈ విషయాన్ని ఎవరో అనడం లేదు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లోనే ఆహార భద్రత నియమ నిబంధనలను తుంగలో తొక్కిన విషయాలు బహిర్గతమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో త్రీ స్టార్ హోటళ్ళు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది లహరి ఇంటర్నేషనల్, వంశీ ఇంటర్నేషనల్ హోటళ్ళలో ఫుడ్ సేఫ్టీ పాటించడం లేదనే విషయం బట్టబయలైంది. పేరుకే స్టార్ హోటళ్ళు అని కాకా హోటళ్ళ కన్నా దారుణంగా అక్కడ పరిస్థితులున్నాయన్న విషయం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. నిజామాబాద్ జిల్లాలో దశాబ్ధ చరిత్ర కలిగిన ఢిల్లీ వాలా స్వీట్ హోం తయారి కేంద్రంలో తనిఖీ చేసిన ఆహార భద్రత నియంత్రణాధికారులు అక్కడ ఉన్న పరిస్థితులను చూసి నోటీసులు జారీ చేయడం గమనార్హం. మిర్చికంపౌండ్ లో మసాలా తయారీ కేంద్రాలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. రాష్ట్ర ఫుడ్ సేఫ్టి కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు హోటళ్ళలో స్వీట్లు తయారి కేంద్రాలలో మసాలా తయారి కేంద్రాలలో ఐదుగురు సభ్యులతో కూడిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ హెడ్ జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ,ఇన్స్ పెక్టర్లు రోహిత్ రెడ్డి, స్వాతి, శీర్థిక ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

. . . లహరి ఇంటర్నేషనల్ లో రూ.50 వేల విలువైన కుళ్లిన మాంసం . . .నోటీసులు జారీ
నగరంలోని బైపాస్ రోడ్డులో గల లహరి ఇంటర్నేషనల్ లో ఆ టీం తనిఖీలు చేసి రెస్టారెంట్ లో రిప్రిజిరేటర్ లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం టెంపరేచర్ ను మెయింటెన్ చేయడం లేదని గుర్తించారు. ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో 122.5 కిలోల విలువ కలిగిన దాదాపు రూ.30 వేల విలువైన కుళ్లిపోయిన మాంసాన్ని గుర్తించారు. హానికరమైన రంగులు కలిపిన చికెన్ 24 వేల విలువైనదిగా గుర్తించారు. అదే విధంగా మిర్చి పేస్ట్ కు ఫంగస్ ను గుర్తించి కూరగాయలకు బుజుపట్టినట్లు తనిఖీలలో తేలింది. లహరి హోటల్ యజమాన్యంపై జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాంసం ఉత్పత్తులను ధ్వంసం చేసి నోటీసులు జారీ చేశారు.
. . . వంశీ ఇంటర్నేషనల్ కు ఎఫ్ఎస్ఎస్ఏ నోటీసులు జారీ . . . షాంపిళ్ళ సేకరణ
నగరంలోని పూలాంగ్ లో గల వంశీ ఇంటర్నేషనల్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు 24 వేల విలువ గల రిఫ్రిజిరేటర్ లో హానికరమైన రంగులు పూసిన మాంసం ఉత్పత్తులను గుర్తించారు. ఫ్రిజ్ లో ఉడకబెట్టి ఉంచిన మిర్చి ఫేస్ట్ తో పాటు కాలం చెల్లిన మాసాల పొడిలను గుర్తించి ధ్వంసం చేశారు. ఆహార దార్థాలు తయారు చేసే కిచెన్ లో సరైన వెలుతురు లేకుండా హోటల్ కు వచ్చే వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏ నోటీసులు జారీ చేసి, షాంపిల్స్ ను సేకరించారు.
. . . అపరిశుభ్ర వాతావరణానికి ఢిల్లీ వాలా స్వీట్ తయారి కేంద్రం . . . నోటీసులు జారీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దశాబ్ధాల చరిత్ర కలిగిన రాష్ట్రపతి రోడ్డులోని ఢిల్లీ వాలా స్వీట్ హోంలో ఫుడ్ సేఫ్టీ అదికారులు తనిఖీలు చేసి విస్తుపోయారు. అక్కడ అపరిశుభ్ర వాతావరణం అధికారులను ఖంగుతినిపించింది. సంబంధిత నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ జోనల్ హెడ్ జ్యోతిర్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వీట్ ల పేరిట ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఢిల్లీ వాలా స్వీట్ హోం నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి షాంపిళ్ళను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.
. . . మిర్చికంపౌండ్ లో మసాలా తయారి కేంద్రాల నుంచి షాంపిళ్ళ సేకరణ . . . ఇంప్రూమెంట్ నోటీసులు జారీ
నిజామాబాద్ నగరంలో మసాలా తయారికి ప్రసిద్దిగాంచిన మిర్చికంపౌండ్ లో మసాలా తయారి కేంద్రాలలో ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఫ్యాక్టరిల నిర్వాహకులపై మండిపడ్డారు. అనుమానాస్పద షాంపిళ్ళను సేకరించి ల్యాబ్ లకు తరలించారు. ఫుడ్ సేప్టీ నోటీసులను జారీ చేయడంతో పాటు ఇంప్రూమెంట్ నోటీసులను కూడా జారీ చేశారు.

