మెండోరా, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా. రాజశ్రీ సోమవారం పోచంపాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె వ్యాక్సిన్ నిల్వ కోసం ఉపయోగిస్తున్న ఐఎల్ఆర్ ను తనిఖీ చేసి, వ్యాక్సిన్ల నిల్వ, ఉష్ణోగ్రత నిర్వహణ, కోల్డ్ చైన్ విధానాలను పరిశీలించారు. అలాగే పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన రిజిస్టర్లు, వ్యాక్సిన్ స్టాక్ రికార్డులు, ఇతర సంబంధిత నమోదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరోగ్య సూచికలు, తల్లి-శిశు ఆరోగ్యం, టీకాల కార్యక్రమం, కుటుంబ నియంత్రణ, అంటువ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించి, సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న డా. రాజశ్రీ చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డా. మద్దుల రాకేష్, మెడికల్ ఆఫీసర్, పీహెచ్సీ పోచంపాడ్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

