. . . చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలు
. . . దర్యాప్తు వేగవంతమైన సమయంలో నిర్ణయం
వెబ్ డెస్క్, బతుకమ్మ :
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రస్ట్ కు సంబంధించిన విరాళాల చోరీ ఆరోపణల నేపథ్యంలో జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్తో పాటు కీలక సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చకు దారితీసింది. విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణను ముమ్మరం చేసిన సమయంలోనే ఈ రాజీనామాలు వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ట్రస్ట్ కు సంబంధించిన ఓ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విరాళాల లెక్కింపు ప్రక్రియ, నిధుల నిర్వహణలో అవకతవకలపై దర్యాప్తు వేగవంతమైంది. విచారణ ట్రస్ట్లోని ఉన్నత స్థాయి బాధ్యుల వరకు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలపై ట్రస్ట్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రస్ట్ తదుపరి చర్యలు, అధికారిక స్పందనపై ఆసక్తి నెలకొంది.
