ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తీర్మాన్ పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పొలానికి విద్యుత్ సరఫరా రావడం లేదని సర్వీస్ వైర్ను పరిశీలించేందుకు వెళ్లిన కుమ్మరి భూమయ్య (వ్యవసాయదారుడు) విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. సోమవారం భూమయ్య తన వ్యవసాయ పొలానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటి వెనుక భాగంలో ఉన్న సర్వీస్ వైర్ను తనిఖీ చేస్తుండగా, వైర్ జాయింట్ ఊడిపోయి తూకం వేయడానికి సిద్ధంగా ఉన్న రొంపి చేసిన మడిలో పడిపోయింది. విషయం గమనించకుండా మడిలోకి దిగిన భూమయ్యకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది భూమయ్యను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఇందల్వాయి ఎస్సై భుక్యా సుమలత సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మృతదేహానికి శవ పంచనామా పూర్తి చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భుక్యా సుమలత తెలిపారు.
