. . . చిన్నారులకు విద్యా సామగ్రి, పండ్ల పంపిణీ
. . . విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకున్న కృపాల్ సింగ్ సోడి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
విద్య అనేది జీవితాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధమని పి.ఆర్.టి.యు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి పేర్కొన్నారు. గత 32 సంవత్సరాలుగా సమాజ సేవలో నిమగ్నమై రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన ఆయన గురువారం తన జన్మదిన వేడుకలను జీపీఎస్ శివాజీ నగర్, బ్రహ్మపురి పాఠశాలల విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్, రాత కాపీలు, ఎగ్జామినేషన్ ప్యాడ్స్, వాటర్ బాటిల్స్, స్కూల్ బ్యాగ్స్, పలకలు, పెన్నులు, స్కేల్స్ తో పాటు పండ్లను పంపిణీ చేశారు. సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా విద్యార్థులు ఎదగాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కృపాల్ సింగ్ సోడి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సౌత్ మండల ఎంఈఓ ఎం. సాయి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో కృపాల్ సింగ్ సోడి చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.

ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, విద్య ద్వారానే వారి భవిష్యత్తు ఉన్నతంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. అనంతరం కృపాల్ సింగ్ సోడి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యతో పాటు మంచి నడవడిక, పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, విద్య జీవనోపాధితో పాటు మంచి జీవన విధానాన్ని నేర్పుతుందని తెలిపారు. తన జన్మదిన సందర్భంగా ఇంటి ముందు వేప మొక్కను నాటినట్లు తెలియజేసిన ఆయన, ప్రతి ఒక్కరూ తమ జన్మదినం రోజున ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చందు, దిలీప్, ఉపాధ్యాయులు మమత, ప్రియాంక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

