ఇల్లంతకుంట, బతుకమ్మ :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మంగళవారం ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, శాంతిభద్రతల పరిస్థితులను సమీక్షించారు. పోలీస్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేసి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను మరింత ముమ్మరం చేయాలని ఎస్పీ ఆదేశించారు. చోరీలు, గంజాయి అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలని అధికారులకు సూచించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని, విద్యాసంస్థలు, గ్రామస్థాయిలో ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తనిఖీ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరు, సిబ్బంది విధుల నిర్వహణపై ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

