. . . అదనపు డీసీపీ ఎన్. శుభం ప్రకాష్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
బాధితులకు నాణ్యమైన సేవలు అందించడంలో అన్ని శాఖల సమన్వయం అత్యంత కీలకమని నిజామాబాద్ అదనపు డీసీపీ ఎన్.శుభం ప్రకాష్ అన్నారు. జిల్లాలో మహిళలు, చిన్నారుల రక్షణ, సంక్షేమం, బాధితులకు సత్వర సహాయం అందించేందుకు మంగళవారం నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో మొదటి సారి భరోసా సెంటర్, న్యాయ శాఖ, చైల్డ్ వెల్ఫేర్, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కో – ఆర్డినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు, బాధితులకు అందించాల్సిన న్యాయ సహాయం, వైద్య సేవలు, కౌన్సిలింగ్, పునరావాస చర్యలు, కేసుల విచారణలో అనుసరించాల్సిన విధివిధానాలు, శాఖల మధ్య సమాచార మార్పిడి వంటి అంశాలపై సవివరంగా చర్చించారు. బాధితులకు ఒకే వేదికపై అన్ని సేవలు అందేలా భరోసా సెంటర్ ద్వారా చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు డీసీపీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బాధితులు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా కోలుకునేందుకు అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు.

ప్రతి కేసును సున్నితంగా పరిశీలిస్తూ బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే చైల్డ్ వెల్ఫేర్, న్యాయశాఖ, వైద్యశాఖ అధికారులు తమ తమ శాఖల పరిధిలో అందిస్తున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమన్వయ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఏసిపి ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సిసిఆర్బి సిఐ పాండేరావు, ఎస్సై వర ప్రసాద్ రెడ్డి, ఫోక్సొ కోర్టు ఇన్ చార్జ్ పిపిజి నరసింహారెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ శోభారాణి, జిల్లా ప్రొఫెషనల్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ జోత్స్న, డాక్టర్ వెంకటేష్ సర్వే లైన్ ఇన్ చార్జి(డి.ఎం అండ్ హెచ్.ఓ), డి.సి.పి.ఓ చైతన్య, భరోసా సెంటర్ ఇన్ చార్జి మహిళా ఎస్సై పుష్పావతి, భరోసా సెంటర్ రోజా, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

