ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండలంలోని తోర్తి గ్రామానికి చెందిన రాజారాపు సత్యనారాయణ ఉపాధి నిమిత్తం కొన్ని సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే నెల రోజుల క్రితం ఆయన సౌదీలో అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. ఇటీవల ఆయన మృతదేహం సౌదీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తోర్తి గ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు అత్యవసరంగా అంబులెన్స్ సౌకర్యం అవసరమైంది. ఈ విషయాన్ని తోర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి ఉచితంగా అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మృతుడు రాజారాపు సత్యనారాయణ కుటుంబ సభ్యులు, తోర్తి గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
