. . . 15 నుంచి కోల్బెల్ట్ ప్రాంతాల్లో విస్తృత పర్యటన
హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈ నెల 15వ తేదీ నుంచి సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ‘బాయిబాట’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా సింగరేణి అండర్గ్రౌండ్, ఓపెన్కాస్ట్ గనుల వద్ద కార్మికులను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. బాయిబాట తొలి విడత కార్యక్రమంలో భాగంగా కవిత ఆరు రోజుల పాటు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సింగరేణి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బొగ్గు గనుల వద్ద కార్మికులతో సమావేశాలు నిర్వహించి, వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పర్యటన షెడ్యూల్ ప్రకారం, జూన్ 15న చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులను సందర్శిస్తారు. 16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ ఏరియాలో, 17న రామగుండం నియోజకవర్గంలోని ఆర్జీ-1 ఏరియాలో పర్యటిస్తారు. అనంతరం 18న ఆర్జీ-2 ఏరియా, 19న మంథని నియోజకవర్గ పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్తో పాటు ఆర్జీ-3 ఏరియాలో కార్మికులతో సమావేశమవుతారు. పర్యటన చివరి రోజైన 20న భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు గనులు, ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులను సందర్శించి కార్మికులతో మమేకం కానున్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, కోల్బెల్ట్ ప్రాంత ప్రజలతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ ‘బాయిబాట’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
