కామారెడ్డి, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల అంకితభావం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎస్పీ, జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

