. . . జవహర్ లాల్ నెహ్రూ దూర దృష్టి వల్లనే ఇది సాధ్యమైంది
. . . డిసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామ కృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
స్వాతంత్ర్యం వచ్చినప్పుడు గుండు పిన్ను కూడా తయారు చేయలేని స్థితిలో ఉన్న మన దేశం ఈ రోజు ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే అది నెహ్రూ దూరదృష్టి వల్లనే అని, ఆయన చేసిన సంస్కరణలు దేశ ప్రజలు మరిచిపోలేరని డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామ కృష్ణ అన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో బుధవారం భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి, అనంతరం నెహ్రూ పార్కు లోని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ దేశ ప్రధానిగా దేశానికి ఎనలేని సేవ చేశారని, స్వాతంత్ర్య ఉద్యమంలో, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ అభివృద్ధిలో నెహ్రూ పాత్ర కీలకమని అన్నారు. దేశంలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారని, వ్యవసాయ రంగం కొరకు ఆయకట్టలు నిర్మించారని, దానికి భాక్రనంగళ్ వంటి ప్రాజెక్టులు ఉదాహరణ అని, మన జిల్లాలో కూడా శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించి జిల్లా ప్రజలకు సాగు, త్రాగు నీటి సౌకర్యం కల్పించారని తెలిపారు. యువతకు మెరుగైన విద్య కొరకు ఐఐటీ లు, శాస్త్రీయ పరిశోధన సంస్థలు ఏర్పాటు చేశారని అన్నారు. దేశానికి సేవలు అందించిన నెహ్రూ 1964 మే 27 న కన్ను మూసారని, ఆయన చేసిన సేవలు జిల్లా ప్రజలు ఎన్నటికి మరువలేరని, ఆయన చూపిన మార్గంలో యువకులు నడిచి దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న బీజేపీ నాయకులు నెహ్రూ ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఆకాశంపై ఉమ్మివేస్తే అది వారిపైనే పడుతుందని బీజేపీ నాయకులు గమనించాలని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, కో ఆప్షన్ మెంబర్ నరేంద్ర సింగ్, జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్, కార్పొరేటర్ నరేందర్, శివ చరణ్, జిల్లెల రమేష్, మల్యాల గోవర్దన్, కోనేరు సాయి కుమార్, ఆడే ప్రవీణ్, రాజ్, ముశ్షు పటేల్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

