. . . 2 వేల కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు చేయడం గర్వ కారణం
. . . ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నాయి
. . . ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
హైదరాబాద్, బతుకమ్మ :
నిమ్స్ లో విజయవంతంగా 2 వేల కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు చేసిన సందర్భంగా నిమ్స్ డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సత్కరించారు. శనివారం నిమ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమ్స్ లో విజయవంతంగా 2,000 కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు పూర్తి కావడం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగానికి గర్వకారణమని అన్నారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన నిమ్స్ వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తూ కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్నాయన్నారు. ఒకప్పుడు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అంటే భారీ ఖర్చుతో కొద్దిమందికే అందుబాటులో ఉండేదని, ఈరోజు పేదలకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అవయవ మార్పిడి వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అవయవ మార్పిడి ఆపరేషన్కే కాదు.. ఆపరేషన్ అనంతరం జీవితాంతం ఉచితంగా మెడిసిన్ కూడా అందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం డయాలిసిస్ నుంచి ట్రాన్స్ ప్లాంట్ వరకు పూర్తి కిడ్నీ కేర్ ఎకోసిస్టమ్ నిర్మిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 100కు పైగా డయాలిసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, మరో 79 కొత్త డయాలిసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిమ్స్ తో పాటు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కూడా అవయవ మార్పిడి సేవలను బలోపేతం చేస్తున్నామని, గాంధీ ఆస్పత్రిలో స్టేట్ ఆర్గన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ను ఇటీవలే ప్రారంభించుకున్నామని, సనత్నగర్ టిమ్స్ ను ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

