24 C
Hyderabad
Sunday, August 2, 2026

రైస్ మిల్లర్ల దందా ఆపండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అదనపు తరుగు పేరిట రైతులను నిలువు దోపిడీ చేస్తే ఊరుకోం

 

. . . అధిక తరుగు తీస్తున్న ముకుంద రైస్ మిల్లును తక్షణమే సీజ్ చేయాలి

 

. . . రేపటి వరకు సమస్య పరిష్కారం కాకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తాం

 

. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరిక

 

బాల్కొండ, బతుకమ్మ :

 

బాల్కొండ నియోజకవర్గంలోని కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ వద్ద ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, రైస్ మిల్లర్ల దోపిడీపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మార్కెట్ యార్డ్‌ ను సందర్శించి, క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచే జిల్లా అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లైస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి, రైతుల పక్షాన నిలదీశారు. ఒక ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో ఉండి అరగంట నుంచి ఫోన్ చేస్తుంటే కలెక్టర్ అందుబాటులోకి రాకపోవడం ఏంటి?” అని అధికారులను ప్రశ్నించారు. రైతులు ఇక్కడ ఎండలో కష్టపడుతుంటే అధికారుల నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు. కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ నుండి వెళ్తున్న ధాన్యానికి ముకుంద రైస్ మిల్లు యాజమాన్యం అడ్డగోలు నిబంధనలు పెడుతోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 41.5 కిలోలకు బదులు 44.5 కిలోలు (దాదాపు క్వింటాలుకు 10 కిలోల అదనపు తరుగు) ఇస్తేనే దించుకుంటామని లారీలను లేకుంటే దింపమని రైస్ మిల్లర్లు అనడం ఏంటి అని అధికారులను నిలదీశారు. నిబంధనలు పాటించని ఒక్క రైస్ మిల్లును సీజ్ చేయండి.. అప్పుడు అందరూ లైన్లోకి వస్తారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు మిల్లులను సీజ్ చేసి దారికి తెచ్చానని అధికారులకు సూచించారు. రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చినా, అదనపు తరుగు అడగడం మిల్లర్ల అహంకారానికి నిదర్శనమని అన్నారు. పాలసీ ప్రభుత్వం తయారు చేస్తుందా? లేక రైస్ మిల్లర్లు తయారు చేస్తారా? ప్రభుత్వ యంత్రాంగం ఇంత చేతగానిదిగా ఎందుకు తయారైందని ఘాటుగా ప్రశ్నించారు. తహసీల్దార్లు, ఇన్-ఛార్జ్ అధికారులు మిల్లర్లకు, రైతులకు మధ్య నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముకుంద రైస్ మిల్లర్ 44.5 కిలోలు అడుగుతున్న మాట వాస్తవమేనని, తన దగ్గర వీడియో రికార్డింగ్ సాక్ష్యం కూడా ఉందని అధికారులకు స్పష్టం చేశారు. తరుగు లేకుండా ధాన్యంతో అన్-లోడింగ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, లారీల సంఖ్యను పెంచి రవాణాను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బోధన్, బాన్సువాడ ప్రాంతాల నుండి ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ డైవర్ట్ చేయాలన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు సమస్య పరిష్కారం కాకపోతే, నేనే స్వయంగా ఆందోళన నిర్వహిస్తానని, రైతుల కోసం రోడ్డు మీదకు వస్తానని అధికారులకు అల్టీమేటం జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతు నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

Stop the rice millers' racket

More articles

Latest article