. . . తేమతో నిమిత్తం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి
. . . సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ప్రసాద్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసే సన్న వడ్ల బోనస్ యాసంగి పంటకు ఇవ్వకపోవడం, దొడ్డు బియ్యం వడ్లను కొనకపోవడం రైతులను నిలువునా మోసం చేయటమేనని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ప్రసాద్ అన్నారు. శుక్రవారం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట రాములు, వెంకటేష్, శంకర్ గౌడ్, నాగన్న, జిల్లా కమిటీ సభ్యులు సురేష్, నాయకులు మార్కంటి అంజయ్య చక్రధర్, రాజు లతో కలిసి నిజామాబాద్ టౌన్ లో గల గంజి పర్యటన చేశారు.

రైతులను, ఐకెపి అధికారులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని తేమతో నిమిత్తం లేకుండా కొంటామని ప్రభుత్వం మాటల్లో చెబుతుందని కానీ ఆచరణలో 15% కంటే తక్కువ తేమ ఉంటేనే కొనాలని, ఒక్కరోజులో 40 వేల క్వింటాళ్లు ధాన్యంకు మించి కొనొద్దని ఐకెపి సెంటర్లకు ప్రభుత్వం పరిమితి విధించడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా కొనే ధాన్యానికి తేమ శాతం 17% గా పేర్కొన్న ప్రభుత్వం ఐకెపి సెంటర్ కొనుగోలుదారులకు 15% కంటే తక్కువ తేమ ఉంటేనే కొనాలి అనే డైరెక్షన్ ఇవ్వడం ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనం అన్నారు.

ఫలితంగా మార్కెట్ కు ధాన్యం తీసుకొచ్చిన రైతు వారం రోజులు పాటు కుటుంబాన్ని భార్యా పిల్లలను వదిలేసి మార్కెట్లో పడిగాపులు కాస్తున్నారని, దిక్కుతోచని స్థితిలో ప్రైవేట్ మిల్లర్ల దగ్గర 5 కేజీల తరుగుతోపాటు తక్కువ రేటుకు రూ.1800 నుండి 2100 మధ్యలో తెగ నమ్ముకోవాల్సిన పరిస్థితికి మెట్టబడుతున్నారని చెప్పారు. వాస్తవంగా గిట్టుబాటు ధర రూ.2389 ఎక్కడ రావడం లేదు. క్వింటాలుకు 1000 రూపాయల పైన రైతులు ప్రైవేటు మిల్లర్ల చేతిలో నష్టపోతున్నారని ఇలాంటి దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకే నీరెత్తినట్లుగా వ్యవహరించడం చూస్తే అనేక అనుమానాలకు కలుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ మిల్లర్లు కలిసి ఒక అవగాహనతోనే రైతులను నిలువు దోపిడి చేస్తున్నట్లుగా అర్థమవుతుందని అన్నారు. తక్షణమే మిల్లర్ల దోపిడీని అరికట్టాలని తేమ తో నిమిత్తం లేకుండా ధాన్యాన్ని కొనాలని, యాసంగి పంటకు బోనస్ ను వర్తింపజేయాలని, దొడ్డు వడ్లను కొనాలని, తరుగు పేరుతో అదనంగా దోపిడీ చేస్తున్న మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతన్న సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
