. . . న్యూ డెమోక్రసి డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కార్మికులు ఐక్యంగా ఉద్యమించినప్పుడే హక్కులు రక్షించబడతాయని, ఐక్య ఉద్యమాలకు కార్మికులందరూ సిద్ధం కావాలని న్యూ డెమోక్రసి డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్ అన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్ టియు) ఆధ్వర్యంలో మేడే వారోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం శ్రామిక నగర్ గూడెం, బోర్గం పి లో మేడే జెండాను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి, గూడెం వాసి నతానియల్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో శ్రీధర్ మాట్లాడుతూ కార్మికులను కాపాడవలసిన ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలించుకోవాలని చూస్తోందని, కార్పొరేట్లకు అండగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని అన్నారు. ఐఎఫ్ టియు నగర అధ్యక్షులు దేవరాజు మల్లికార్జున్ మాట్లాడుతూ గతంలో గూడు లేని ప్రజలందరూ ఐక్యంగా ఉండి పోరాడి ఇళ్ల స్థలాలు సాధించుకొని సౌకర్యాలు మెరుగు పరుచుకోని గూడెం నిర్మించుకున్నామని గుర్తు చేశారు. న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా మాట్లాడుతూ ఎర్రజెండా పార్టీ కష్టజీవుల పక్షాన నిస్వార్ధంగా పనిచేస్తుందని అన్నారు. ఎర్రజెండా పార్టీ నాయకత్వంలో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో మానవ హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది రమేష్, ఐఎఫ్ టియు నగర కార్యదర్శి ఎం.శివకుమార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజు, పోషన్న, గంగమణి, గూడెం వాసులు తదితరులు పాల్గొన్నారు.
