. . . తెలంగాణ విశ్వ విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ డా.లక్ష్మణ్ చక్రవర్తి
డిచ్ పల్లి, బతుకమ్మ :
సంక్షేమ పథకాలు, సరైన విధానాలు రూపొందించడంలో జనగణన డేటా కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ విశ్వ విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ డా.లక్ష్మణ్ చక్రవర్తి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం, ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో మంగళవారం “నో యువర్ నేషన్ : అవేర్ నెస్ ఆన్ సెన్సస్ 2026” అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్ ప్రిన్సిపాల్ డా.లక్ష్మణ్ చక్రవర్తి జనగణన దేశ అభివృద్ధికి మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించి గణనలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. టుటా అధ్యక్షులు డా. పున్నయ్య జనగణన ద్వారా దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన లభిస్తుందని అన్నారు. యువత ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజంలో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు. పీఆర్ఓ డా.రమణాచారి ప్రజల్లో సరైన సమాచారం చేరవేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. అపోహలను తొలగించి, ప్రతి ఒక్కరికీ జనగణన యొక్క ప్రాముఖ్యతను వివరించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా.ఎన్.స్వామి, డా. శ్రీనివాస్, సిహెచ్ నర్సయ్య, బోధక సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

